కమ్యూనిస్టులే తెలంగాణ సాయుధ పోరాట వారసులు సిపిఎం రాష్ట్ర నాయకులు పుప్పాల శ్రీకాంత్
*కమ్యూనిస్టులే తెలంగాణ సాయుధ పోరాట వారసులు*
*బీజేపీకి అనువంత సంబందం లేదు*
*మతోన్మాదులకు మాట్లాడే హక్కు లేదు*
*ప్రభుత్వం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్థూపాలను ఏర్పాటు చేయాలి*
-- *సిపిఎం రాష్ట్ర నాయకులు పుప్పాల శ్రీకాంత్*
చురకలు విలేఖరి
జగిత్యాల, సెప్టెంబర్,22
భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుండి విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించాలని, మతోన్మాదం, కార్పొరేట్ సంస్థల కలిసి ప్రజలపై చేసిస్తున్న దాడులను ఎదుర్కోవాలని సిపిఎం రాష్ట్ర నాయకులు పుప్పాల శ్రీకాంత్ పిలుపునిచ్చారు.ఈరోజు జగిత్యాల పట్టణంలోనీ సిపిఎం కార్యాలయంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పక్షోత్సవాల సభ సిపిఎం జగిత్యాల జిల్లా కన్వీనర్ జి.తిరపతినాయక్ అద్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పుప్పాల శ్రీకాంత్ మాట్లాడుతూ ఆనాడు దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని బిజెపి ముస్లింలకు, హిందువులకు మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించి చరిత్రకు వక్ర భాష్యాలు చెప్తున్నదని అన్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు తిప్పి కొట్టాలని కోరారు. తెలంగాణలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన మహోన్నతమైన పోరాటంలో దొడ్డి కొమురయ్య, షేక్ బందగి, ఠాన్ నాయక్, షోయబుల్లాఖాన్ లాంటి ఎందరో వీరులు అశువులుబాసారని అన్నారు. వీళ్లంతా కుల, మతాలతో సంబంధం లేకుండా భూస్వాముల అణిచివేతకు, దోపిడీకి, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వారిలో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డితో పాటు మగ్దూం మొహియుద్దీన్ ఉన్న విషయాన్ని మర్చిపోకూడదని అన్నారు. అలాంటప్పుడు హిందూ, ముస్లింల మధ్య పోరాటం ఎలా అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో సోయబుల్లాఖాన్, షేక్ బందగి, మగ్దూం మోహినుద్దీన్, జవ్వాద్ రజ్వీ, ఆలం ఖుందుమీరి, షౌకత్ ఉస్మాని తదితర ముస్లిం నాయకులు నిజాం పైన పోరాటం చేశారని గుర్తు చేశారు. ప్రజలను పట్టిపీడించింది, వెట్టిచాకిరి చేయించుకున్న వారిలో విసునూరు రాంచంద్రారెడ్డి, జన్నారం ప్రతాప రెడ్డి లాంటి హిందువులైన జమీందారులు, జాగిర్దారులు, దొరలు, దేశ్ ముఖ్ లు, భూస్వాములు, పటేల్, పట్వారిలే మెజారిటీగా ఉన్నారని, వీరి ఆగడాలకు వ్యతిరేకంగానే ప్రజలంతా కుల, మతాలకతీతంగా ఐక్యంగా సాగించిన పోరాటాన్ని మతం పేరుతో ఎలా వక్రీకరిస్తారని ఆయన విమర్శించారు. బిజెపి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మహాత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు పులుమితే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలు వాస్తవ చరిత్రను తెలుసుకోవాలని అన్నారు. ఈ ప్రాంతం కు చెందినటువంటి బద్దం ఎల్లారెడ్డి గారు అమృత్. లాల్ శుక్ల . కర్రోలి నరసయ్య. గడ్డం తిరుపతి రెడ్డి. పడుతుంది భూపతి రెడ్డి. గార్లువెట్టి చాకిరి నుండి విముక్తి కోసం, దున్నేవాడికే భూమి కావాలని పోరు చేసిన అమరవీరులని వారి త్యాగాలను ప్రజలకు తెలిసే విధంగా జగిత్యాల పట్టణంలోని ప్రధాన కూడలిలో వారి కాంస్య విగ్రహాలను పెట్టాలని అన్నారు.వారి త్యాగాలకు మతం రంగు పులిమే మతోన్మాద చర్యలను ప్రజలు ఖండించాలని పిలుపునిచ్చారు. ఇది ప్రజల కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా బలిదానం చేసిన రైతాంగ సాయుధ పోరాట అమరుల త్యాగాలను కించపరచడమేనని అన్నారు. అమరులను గుర్తు చేసుకోవడం అంటే, మతోన్మాదుల ఆగడాలకు, కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతూ అమరులు చూపిన బాటలో పయనించడమేనని, నేడు మన ముందున్న కర్తవ్యం అని అన్నారు.
ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఇందూరి సులోచన,కోమటి చంద్రశేఖర్,వి.వెంకటచారి, జి.రమేష్, సిరికొండ చంద్రయ్య, శంకర్, మల్యాల సురేష్,బోర్ర శేఖర్,రఫిక్, సూలేమాన్, రజిత, రాదా,పూజ, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

