శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు
శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు
......................................
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
........................................
'శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశినీ, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ' ...భారత, రామాయణాది పౌరాణిక గాధలలో శమీ వృక్షానికి విశేష ప్రాధాన్యత కల్పించ బడింది. శమీకే అపరాజిత అనిపేరు. అంటే ఓటమి నెరుగని మాతయని అర్థం. అమెయే విజయ నామాంకితయైన జగజ్జనని. శరన్నవరాత్రి వేడుక లలో భాగంగా, దుర్గా మాతను తొమ్మిది రోజులుగా కొలిచి నట్లయితే సర్వ శక్తులు సమకూరి, విజయ దశమి నాడు విజయం చేకూరగలదని భక్తుల, ఆధ్యాత్మిక కార్యానురక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులకై దసరా ఉత్సవాలలో ముగింపుగా విజయ దశమి పర్వ దినాన సాయంత్రం శమీ (జమ్మి) వృక్షాన్ని పూజించి, సర్వాభీష్ఠ సిద్ధికై ప్రార్ధించడం ప్రాచీన కాలంనుండి అనుసరిస్తన్న సత్సాంప్రదాయం. శని వారం విజయ దశమి సందర్భంగా ధర్మపురి క్షేత్రంలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం లోని ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మీసమేత నారసింహ, శ్రీవేంకటేశ్వర, రామలింగేశ్వరాలయాలలో విశేష పూజలు, వేడుకలు నిర్వహించేందుకు సంసిద్ధ మవుతున్నారు. ప్రత్యేకించి, క్షేత్ర శివారులో, అక్క పెల్లి రాజేశ్వరాలయ దారిలోగల అక్కపెల్లి రాజేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ శీలం పెద్ద గంగారాం బహూకృత స్థలంలో నూతన నిర్మిత స్థలమందు శమీ, ఆయుధ పూజలు శని వారం సాయంత్రం నిర్వహిం చేందుకు ఏర్పాట్లను గావిస్తున్నారు.
వైభవంగా మహర్నవమి వేడుకలు
సుప్రసిద్ధ పుణ్యతీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో శర న్నవరాత్రి ఉత్సవాలలో అంతర్భాగంగా శుక్ర వారం మహర్నవమి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. పర్వదిన సందర్భంగా దేవస్థానాంతర్గత శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మీనారసింహ, శ్రీవేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వర ఆలయాలలో ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ, ముత్యాల శర్మ, అర్చకులు నంబి శ్రీనివాసాచార్య, నరసింహ మూర్తి, వంశీ, హరినాథాచార్య, అశ్విన్ కుమార్, నేరేళ్ళ శ్రీనివాసాచార్య, రమణాచార్య, సంతోష్ కుమార్, విజయ్, కళ్యాణ్, కిరణ్, మోహన్, తదితరులు విధివిధాన వేదోక్త సాంప్రదాయ ప్రత్యేక అర్చనలు, నిత్య కల్యాణ కార్యక్రమాలను గావించారు. శ్రీరామలింగేశ్వర ఆలయంలో గల శ్రీశారదామాత మందిరంలో దేవస్థాన వేదపండితులు బొజ్జా రమేశశ ర్మ నేతృత్వంలో ప్రముఖ వేదవిదులు ముత్యాల శర్మ,భరత్ శర్మ, పాలెపు ప్రవీణ్ శర్మ, సందీప్ శర్మ, అరుణ్, సాయి, అర్చకులు దేవళ్ళ విశ్వనాథశర్మ తదితరులు, ప్రత్యేక దుర్గామాత పూజలొ నరించారు. నవగ్రహ, వాస్తు, క్షేత్రపాలక, స్థాపిత దేవతా హోమాలు, చండీ సప్త శతి హవనం, చతుష్షష్టి పూజలు, బలిప్రదానం, పూర్ణాహుతి తదితర సాంప్రదాయ పూజల నొనరించారు. ఈఓ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, దేవస్థానం సిబ్బంది, భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని పర్యవేక్షించి, అవసరమగు వసతులు కల్పించారు. శ్రీనర్మ దేశ్వర మందిరంలో వేదవిదులైన పండితులు, పాలెపు చంద్రమౌళి శర్మ, వెంకట రమణ శర్మ ఆధ్వ ర్యంలో స్థాపిత దుర్గామాతకు విశేష పూజలొనరించారు. పూర్ణాహుతిని నిర్వహించారు. నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో కొత్త టి టి డి కల్యాణ మండపంలో అశేష భక్తజనం కార్యక్రమాలలో భాగస్వాములైనారు. లక్ష్మీనరసింహుని పొన్నచెట్టు సేవలకు పురవీధులగుండా ఊరేగించారు.

