అక్టోబర్ 21 పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం
అక్టోబర్ 21...పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
..............................................
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
.........................................
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపు కుంటారు. భారత్ - చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశ వ్యాప్తంగా విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమర వీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది. మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాలైన లడక్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతా దళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే మహత్తర బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలు నిర్వర్తించేవి. 1959 అక్టోబరు 21న డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటిబుగ్గ అని అర్థం. కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి పవిత్ర స్థలంగా రూపు దిద్దుకుంది. ప్రతి ఏడాదీ అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ.
భారత్ - చైనా సరిహద్దులో ఉన్న లడక్లోని అక్సాయ్చిన్ వద్ద కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) సరిహద్దు రక్షణలో ఉన్నారు. 1959 అక్టోబరు 21న విపరీతమైన చలిలో పదిమంది సీఆర్ పీఎఫ్ పోలీసులు విధులు నిర్వహిస్తుండగా చైనాకు చెందిన సైనికులు భారీ సంఖ్యలో మన దేశ సరిహద్దులోకి చొచ్చుకు వచ్చారు. వారిని ఈ పది మంది పోలీసులు ధైర్యంతో ఎదిరించి, చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి, దేశం కోసం అసువులు బాశారు. భారతదేశ రక్షణ కోసం పోలీసు ఉన్నతా ధికారులు 1960 జనవరి 9న సమావేశమై ‘అక్టోబరు 21న పోలీసు అమర వీరుల సంస్మరణ దినం’గా పాటించాలని తీర్మానించి నారు. ఆనాటి నుండి నేటివరకు దేశవ్యాప్తంగా ‘అక్టోబర్ 21న పోలీసు అమర వీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు. పండగ, పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి, మరణించే పోలీసుకు, అందునా ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడం మనందరి బాధ్యత... పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసు అమర వీరుల సంస్మరణ దినం జరుపు కోవడం లోని ప్రధాన ఉద్దేశం.
శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే వారు సైనిక జవానులైతే, అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి, భద్రతకు భరోసా ఇచ్చేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది పోలీసులు. శాంతి భద్రతలను అదుపులో పెట్టడం, నేరగాళ్ళను నియంత్రిం చడం పోలీసు కర్తవ్యం. అంతర్గత భద్రతను కాపాడే పనిలో పోలీసులు ప్రాణాలు సైతం అర్పిస్తున్నారు.
విలువైనది ప్రాణం. అలాంటి ప్రాణాన్ని త్యాగం చేయడం అన్నది అత్యున్నత స్థాయి త్యాగం.
పోలీసు విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నది. ఇతర ఉద్యోగుల్లా కొన్ని గంటలకు మాత్రమే పరిమితమయింది కాదు. ఇరవై నాలుగు గంటల ఉద్యోగం ఒక్క పోలీసు ఉద్యోగమే. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం. ప్రతి ఒక్కరు ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే. ప్రభుత్వం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసే.

