రాజకీయంగా దిగజారిన సోను, సతీష్, మావోయూస్ట్ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్
రాజకీయంగా దిగజారిన ద్రోహులు సోను, సతీష్ లకు
మా పార్టీ పంథాను తప్పు పట్టే హక్కు లేదు
మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్
చురకలు ప్రతినిధి
హైదరాబాద్, నవంబర్, 10
మావొయిస్ట్ పార్టీ దీర్ఘకాలిక ప్రజా యుద్ధ పంథానే కొనసాగిస్తుందని
తమ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న సోను, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్న సతీష్ లు అవకాశవాదంతో, విచ్ఛిన్నకర వైఖరితో మరి కొందరు కేడర్ లను మోసగించి తీసుకుని వెళ్లి మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాలకు లొంగిపోయారని మావోయస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతి నిధి అభయ్ పేరుతొ ప్రకటన విడుదల చేశారు. ఆ లేఖ యాదవీధిగా అందిస్తున్నాం. రాజకీయంగా దిగజారిన వీరిద్దరూ మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకుని, పథకం ప్రకారం లొంగిపోయారు. దాదాపు 3 నెలల క్రితమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి సోను లొంగిపోయేందుకు తమతో సంప్రతించారని పత్రికా ముఖంగా ప్రకటించారు. సతీష్ పాత్రికేయుల ద్వారా ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో సంప్రతింపులు జరిపారు. ఈ సంప్రతింపుల మేరకు, కొద్ది కాలం పాటు ఈ ప్రాంతాలలో ఆపరేషన్ లను నిలిపి వేస్తున్నట్టుగా గఢ్ చిరోలి జిల్లా పోలీసు అధికారి బహిరంగంగా ప్రకటించారు. నారాయణపూర్ జిల్లా పోలీసు అధికారి ఆదేశాలు జారీ చేసారు. ఈ రెండు రాష్ట్రాలలో గఢ్ చిరోలి, బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల ప్రభుత్వ సాయుధ బలగాలు రక్షణ కల్పించాయి. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఇంద్రావతి నదీ తీరంలో, దాని సమీప ప్రాంతాలలో అక్టోబర్ 13వ తేదీ నుంచి 16వ తేదీన వీరు లొంగిపోయే వరకు పెద్ద ఎత్తున బలగాలను మొహరించాయి. వీరి లొంగుబాటును సుగమం చేసాయి. గడచిన దశాబ్దాల తమ రాజకీయ జీవితాన్ని వీరిద్దరూ ఈ రకంగా వర్గ సామరస్య ధోరణితో, రాజ్యంతో కుమ్మక్కై ముగించుకున్నారు.
భారత రాజ్యానికి లొంగిపోయిన సోను, సతీష్ తమ రాజకీయ దిగజారుడును కప్పి పుచ్చుకునేందుకు పార్టీ పంథాను తప్పు పడుతున్నారు. ప్రస్తుత దేశ కాల పరిస్థితులలో వచ్చిన మార్పుల కారణంగా దీర్ఘకాలిక ప్రజా యుద్ధ వ్యూహానికి కాలం చెల్లిందని, అందువల్ల సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నామని, బహిరంగంగా ప్రజా పోరాటాలలో పాలు పంచుకుంటామని చెబుతున్నారు. అలాగే మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాళ్ల కేశవరావ్ అమరుడు కావడానికి ముందు ఆయుధాలు విడిచిపెట్టి శాంతి చర్చలకు సిద్ధం కావాలని అన్నారని చెబుతున్నారు. ఇది శుద్ధ తప్పు. సోను, సతీష్ లు వాస్తవాలను వక్రీకరించి చెబుతున్న విషయాలివి.
వాస్తవానికి, శాంతి చర్చలకు సంబంధించి సతీష్ అవగాహనలో ఉన్న లోపాలను వివరిస్తూ అమరుడు కామ్రేడ్ సంబాళ్ల కేశవరావ్ అతనికి ఉత్తరాలు రాసారు. ఈ ఉత్తరాలలో, ఆయుధాలు విడిచిపెట్టడం గురించి పార్టీ ఆలోచించరాదని, అటువంటిదంటూ ఏమన్నా ఉన్నా కూడా అది కేంద్ర కమిటీ మాత్రమే ఆలోచించాల్సిన విషయం అని వివరించారు. ప్రపంచ విప్లవోద్యమ చరిత్రలో ఆయా దేశాలలో తీవ్రమైన నిర్బంధం విరుచుకుపడినప్పుడు విప్లవ పార్టీలు అనేక నష్టాలు చవి చూసాయని, ప్రజలు కష్టాలు, కడగండ్ల పాలయ్యారని గుర్తు చేసారు. చిలీ దేశంలో సాయుధ పోరాటాన్ని విరమించి బహిరంగం అయిన పార్టీ ఎందుకూ కాకుండా పోయిందని రాసారు. కగార్ ఆపరేషన్ లో ఎదుర్కొంటున్న నష్టాలను నివారించేందుకు కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో 2024 ఫిబ్రవరి, ఆగస్టులలో రూపొందించిన ఎత్తుగడలను అమలు చేసేందుకు దృఢంగా పూనుకోవాలని, అలాగే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడికక్కడ ఎత్తుగడలు చేపట్టాలని
వివరించారు. కాబట్టి ఆయుధాలు విడిచిపెట్టి శాంతి చర్చలకు వెళదామన్నది కామ్రేడ్ సంబాళ్ల కేశవరావ్ అభిప్రాయం కాదు అని స్పష్టంగా తెలియజేస్తున్నాం.
దేశ కాల పరిస్థితులలో మార్పుల గురించి చర్చించిన కేంద్ర కమిటీ 2021లో 'భారత దేశంలో ఉత్పత్తి సంబంధాలలో మార్పులు-మన రాజకీయ కార్యక్రమం' దస్తావేజును రూపొందించింది. దేశంలో భూస్వామ్యం ఒక మేరకు బలహీనపడినప్పటికీ, ఇప్పటికీ భూస్వామ్నమే ప్రధాన వైరుధ్యంగా ఉన్నదని స్పష్టం చేసింది. అలాగే పెట్టుబడిదారీ సంబంధాలలో గతంతో పోల్చుకున్నప్పుడు కొన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ, మెజారిటీ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, భూమి సమస్య మౌలికమైనదని, కాబట్టి దీర్ఘకాలిక ప్రజా యుద్ధ పంథాను కొనసాగించాలని వివరించింది. దేశంలో గడచిన దశాబ్దాలలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ కారణంగా వచ్చిన మార్పులను వివరంగా చర్చించి, ఎత్తుగడలలో మార్పులను రూపొందించింది. ఆయా ప్రాంతాలలో నిర్దిష్ట పరిస్థితులను బట్టి ఎత్తుగడలు ఎక్కడికక్కడ చేపట్టాలన్న మార్గదర్శకత్వం అందించింది. ఈ దస్తావేజుపై వచ్చిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది. ఈ దస్తావేజుతో సోను కానీ సతీష్ కానీ విభేదం వ్యక్తం చేయలేదు. ఇప్పుడు తమ అభిప్రాయాలను దస్తావేజుకు భిన్నంగా బహిరంగంగా మాట్లాడుతున్నారు. నిజానికి దేశ పరిస్థితులను అధ్యయనం చేసి వారు తగిన సూచనలు, సలహాలు ఇచ్చి ఉంటే పార్టీకి ఉపయోగపడేది. పార్టీలో అంతర్గత చర్చ కొనసాగించి ఉంటే ఆరోగ్యకరంగా ఉండేది. కానీ, వారు తామున్న బాధ్యతాయుత స్థానాలను, కేడర్ లలో రాజకీయ అధ్యయనంలో ఉన్న బలహీనతను వినియోగించుకుని కేడర్ లను తప్పు దోవ పట్టించారు. బాధ్యతా రహితంగా వ్యవహరించి కర్తవ్యాలను ఉల్లంఘించారు. కొందరు ఎస్ జడ్ సీ సభ్యులు కూడా ఈ తప్పుడు సూత్రీకరణలను ఆమోదించి వారితో కలిసి లొంగిపోవడం వారిలో అధ్యయన లేమిని తెలియజేస్తుంది..
భారత దేశంలో కానీ మరే దేశంలో కానీ విప్లవోద్యమంలో ఉద్యమం పురోగమిస్తున్నందుకే దోపిడీ పాలక వర్గాలు నిర్బంధ క్యాంపెయిన్ లు చేపడతాయి. ఈ క్రమంలో విప్లవోద్యమం ఆటుపోట్లకు, ఎగుడు దిగుడులకు, మలుపులు మెలికలకు గురి అవుతుంది. కేడర్ లలో పారుబోతుతనం వస్తుంది. ప్రజలలో బలహీనుల నుంచి రాజ్యానికి ఉపయోగపడే శక్తులు తయారవుతాయి. తీవ్రమైన నష్టాలు ఎదురవుతాయి. అయితే వీటి వల్ల పార్టీలు వ్యూహం మార్చుకోవు. వ్యూహం దేశ కాల పరిస్థితులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. సోను, సతీష్ లు మారిన పరిస్థితులంటున్న విషయానికి వివరణ ఇవ్వాలి. పైపై మాటలు రాజకీయ చర్చ కాదు. వారి అవగాహన, ద్రోహం ప్రాణ భయంతో వచ్చినవే తప్ప మరేమీ కాదు.
పార్టీ ఎన్నడూ తన లోపాలను, పొరపాట్లను కప్పి పుచ్చుకోదు, కప్పిపుచ్చుకోలేదు. పార్టీ, ప్రజా సైన్యం, ఐక్య సంఘటన అనే మూడు అద్భుత ఆయుధాలతో భారత కార్మికవర్గ అగ్రగామిగా విప్లవోద్యమానికి మార్గదర్శకత్వం వహించడంలో జరిగిన పొరపాట్లను కాంగ్రెస్ అనంతర 14 సంవత్సరాల కార్యాచరణను సంశ్లేషించి, విశ్లేషించిన కేంద్ర కమిటీ 2020లో రూపొందించిన కేంద్ర రాజకీయ నిర్మాణ సమీక్షలో పేర్కొంది. వివిధ సర్కులర్ లలో పేర్కొంది. వీటి గురించి పార్టీలో సభ్యుల వద్ద నుంచి పై స్థాయి కమిటీల వరకు ఎవరికైనా చర్చించే హక్కు, మార్పులు, చేర్పులు చేసే హక్కు ఉంటుంది. పార్టీ నిబంధనావళిని అనుసరించి ఈ రకమైన చర్చ చేయడం బాధ్యత గల కార్యకర్తలు చేయవలసిన పని. సోను, సతీష్ లు ఒక మేరకు ఈ చర్చ చేసి ఉండవచ్చు. కానీ దస్తావేజుతో తమకు భిన్నాభిప్రాయం ఉన్నదని అనలేదు. ఇప్పుడు 'కేంద్ర కమిటీ అన్నీ తప్పులే చేసిందం'టూ సోను ప్రజలకు క్షమాపణలు చెప్పడం. 'ఇక పార్టీ ఏం చేయలేదు. అందరం వచ్చిపోతాం, లేదా సరెండర్ చేయించుకుంటాడం'టూ సతీష్ ఏప్రిల్ నాటి నుంచి మాట్లాడడం ఒక కొసకు వెళ్లి ఆలోచించడం. వారు ఇంతకాలం నమ్మిన మార్క్సిస్టు తత్వశాస్త్ర గతితార్కిక నియమానికి విరుద్ధం. నిజమైన కమ్యూనిస్టులు గతితార్కిక భౌతికవాద దృష్టితో చూస్తారు. అప్పుడే ప్రతి అంశంలోను ఉన్న పాజిటివ్, నెగిటివ్ అంశాలు అర్థం చేసుకోగలుగుతారు. అనుకూలతలు ఉన్న కాలంలో రాబోయే ప్రతికూలతలను అంచనా కడతారు. అలాగే ప్రతికూలతలలో అనుకూలతలను చూడగలుగుతారు. ఇలా చేయకపోతే పెడధోరణి పట్టి, ఒక కొసకు వెళ్లిపోతారు. సోను, సతీష్ లు చేసినదిచే.
పరిస్థితులకు తగిన విధంగా తమ్ము తాము ఎదిగించుకోకపోవడం వల్లనే సోను, సతీష్ లు పెడతోవ పట్టారు. వారిలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణపర, వ్యవహారపర లోపాలను పై, తమ, కింది స్థాయి కమిటీల నుంచి వస్తున్న విమర్శలను స్వీకరించి, సరిదిద్దుకోవాలన్న నిజాయితీ కొరవడడంతో నేడు ఈ స్థితికి చేరుకున్నారు. పైగా కేంద్ర కమిటీని దుమ్మెత్తి పోస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యునిగా సోను కమిటీలో చర్చ చేయకుండా, కేంద్ర కమిటీ ఏకగ్రీవంగా నిరాకరించిన తన అభిప్రాయాలను ప్రజలకు అపీల్ పేరుతో బహిరంగం చేయడం అతనిలో రాజకీయ దిగజారుడును, అవకాశవాదాన్ని తెలియజేస్తుంది. ఎస్ జడ్ సీ స్థాయిలో సతీష్ కేంద్ర కమిటీ అందించిన సైద్ధాంతిక, రాజకీయ అవగాహనను, ఎత్తుగడలను చొరవతో అమలు చేయగలిగితే ఉద్యమానికి ఎంతగానో
2
ఉపయోగపడేది. కానీ తన స్వంత అంచనాలతో కొనసాగాడు. ఈ ఇద్దరూ శత్రు నిర్బంధాన్ని అతిగా అంచనా వేసుకున్నారు. సుదీర్ఘ విప్లవ క్రమాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. తమ అవగాహనా, ఆచరణా లోపాలను కప్పి పుచ్చుకుంటూ కేడర్ లను తప్పు దోవ పట్టించారు. అనేక నష్టాలు పొందడం, ఈ సంవత్సరం కేంద్ర కమిటీ సభ్యులు ఎనిమిది మంది అమరులు కావడం, కగార్ ప్రారంభమయిన నాటి నుంచి ఇప్పటి వరకు 16 మంది రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులు, పదుల సంఖ్యలో డీవీసీ, ఎసీ స్థాయి సభ్యులు, పార్టీ, పీఎల్ జీఏ సభ్యులు, విప్లవ ప్రజానీకం అమరులు కావడంతో, నష్టాలను నివారించుకోలేకపోతున్నామన్న ఆందోళనకు గురి అయిన కొందరు కేడర్ లు సోను, సతీష్ లు పార్టీ పంథాకు భిన్నంగా పెడమార్గంలో చెప్పిన సాయుధ పోరాట విరమణ, బహిరంగ కార్యకలాపాలే మార్గంగా భావించారు. పై స్థాయి కమిటీ సభ్యులుగా సోను, సతీష్ లు చెప్పిన దానిని నమ్మారు. ఇది వారి అవగాహనా లోపం. సుదీర్ఘ కాల రాజకీయ ఆచరణలో నేర్చుకున్న విషయాలను, ప్రజలు వారిపై పెట్టుకున్న ఆశలను మననం చేసుకుని వారంతా పునరాలోచించాల్సిందిగా కోరుతున్నాం.
దేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు రాజ్యం పీడిత వర్గాలు, సమూహాల పట్ల అంతులేని అన్యాయాలు, అత్యాచారాలు చేస్తున్నది. వీటి పట్ల ప్రజలలో తీవ్రమైన నిరసన, ప్రతిఘటన సాగుతున్నాయి. ఎక్కడికక్కడ పోరాటాలు జరుగుతున్నాయి. వీటిని సంఘటితం చేయడంలో పార్టీ వెనుకపడుతున్నదని కేంద్ర కమిటీ గుర్తించి, అందుకు తగిన నిర్ణయాలు చేసింది. ఈ నిర్ణయాలను అమలు చేయడంలో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యాయి, లోపాలు జరిగాయి. అయితే వీటిని అధిగమించడం అసాధ్యం కాదు. ప్రకృతిలో తుఫానులు, కరువులు, వ్యాధులతో మరణాలు ఉన్నట్టుగానే విప్లవంలో నిర్బంధాలు, పారుబోతుతనాలు, నష్టాలు ఉంటాయి. ఈ చారిత్రక భౌతికవాద, గతితార్కిక నియమాన్ని అర్థం చేసుకున్న వారెవ్వరూ విప్లవం ఇక చేయలేం అని నిరాశకు గురి కారు. రాజకీయ వెనుకబాటుతనం, సైద్దాంతిక గందరగోళానికి గురి అయిన వారు ప్రజల కోసం, అంతిమ విప్లవ లక్ష్యం సాధించేవరకు పోరాడాలనే దృఢ దీక్షను కోల్పోతారు. ప్రాణాలు అర్పించాలన్న అంకిత భావంతో విప్లవంలోకి అడుగు పెట్టిన వాళ్లు చివరి వరకు కొనసాగకపోగా, విప్లవానికి ద్రోహం తలపెట్టాలని కుటిల బుద్ధితో విప్లవ సిద్ధాంతంపై, రాజకీయ పంథాపై, పార్టీపై తప్పుడు మాటలు మాట్లాడతారు. ప్రజలను, కేడర్ లను గందరగోళానికి గురి చేస్తారు. పార్టీకి బహిష్కృతులై, ప్రజలకు దూరమై ఎందుకూ కొరగాకుండా పోతారు. లేదా ప్రజా వ్యతిరేకులుగా మారతారు. తెలిసీ తెలియకుండా తప్పు దోవ పట్టిన వాళ్లు, సరైన పద్ధతిలో ఆలోచిస్తే, ఎప్పటికైనా తిరిగి విప్లవం పక్షం వస్తారు. వర్గ రాజకీయాలను గుర్తెరిగిన విప్లవ కేడర్ లు, ప్రజలు ఎవ్వరూ ఈ అవకాశవాదుల మూర్ఖపు మాటలు నమ్మరు.
దేశంలో పీడిత ప్రజలు, సమూహాలు, ప్రజాస్వామికవాదులు, ప్రగతి కాముకులు, పాత్రికేయులు, ప్రజలూ అందరూ ఈ విషయాలను అర్ధం చేసుకుంటూ తమ వంతు కర్తవ్యంగా విప్లవంలో భాగస్వాములుగా కొనసాగుతారని ఆశిస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దేశంలో వ్యవసాయ విప్లవం ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పరిపూర్తి చేసి, ప్రజల రాజ్యాధికారం సాధించి, సమసమాజ స్థాపన దిశగా అంతిమంగా కమ్యూనిజం సాధించే దిశగా ప్రయాణం చేస్తూ ఉంటుందని ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నాం.

