సిఈఐఆర్ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి. సైబర్ మోసాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
సిఈఐఆర్ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి.
సైబర్ మోసాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మే 2: సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని సిఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న, చోరి గురైన 102 మొబైల్ ఫోన్లను ( సుమారు 20 లక్షల విలువగల ) స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి సిఈఐఆర్ వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సిఈఐఆర్ వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ను ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక ఆర్ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్ లతో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 986 ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందన్నారు. సిఈఐఆర్ ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, సిఈఐఆర్ టీం ఆర్ఎస్ఐ కృష్ణ ,హెడ్ కానిస్టేబుల్ మహుముద్ , కానిస్టేబుల్ లు అజర్ యాకూబ్,మల్లేశంలను జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా బాధితులు తమ యొక్క ఫోన్ పోయినా విధానాన్ని వారు ఫోన్ పోయినప్పుడు అవలంబించిన విధానాన్ని తెలియజేశారు.సాంకేతికతను ఉపయోగించి పోయిన సెల్ఫోన్లను తిరిగి కనిపెట్టి తమకు ఇచ్చినందుకు బాధితులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానికి అనుగుణంగా సైబర్ మోసగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను బురిడి కొట్టించి డబ్బులు దండుకుని మోసాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వాటిపై అందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫేక్ ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడమే మంచిదని, ఇంటర్నేషనల్ కాల్స్, కొత్త నంబర్ల నుంచి ఫోన్ వస్తే అప్రమత్తంగా ఉండాలన్నారు. అజ్ఞాత వ్యక్తుల కు ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని, డ్రగ్స్ కేసు అని, ఉగ్రవాదులతో సంబంధాలని బెదిరించగానే భయపడి డబ్బులు బదిలీ చేయొద్దని సూచించారు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ 1930 ఫోన్ చేయాలని కోరారు. లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ , ఆర్ఎస్ఐ కృష్ణ, సిఈఐఆర్ టీం హెడ్ కానిస్టేబుల్ మహమూద్, కానిస్టేబుల్ అజర్,మల్లేష్ పాల్గొన్నారు.